manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 1:54 am Editor : manabharath

విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ అందించడం అభినందనీయం:టీజీజేఎల్‌ఏ జిల్లా అధ్యక్షులు చట్ల ప్రవీణ్ కుమార్

ఇంటర్ విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ – ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం

హర్షం వ్యక్తం చేసిన టీజీజేఎల్‌ఏ జిల్లా అధ్యక్షులు చట్ల ప్రవీణ్ కుమార్

మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు రాష్ట్ర విద్యారంగానికి కొత్త ఊపునిస్తున్నాయని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA-475) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ చట్ల ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటికే ఉచిత ప్రవేశాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు అందిస్తున్న ప్రభుత్వం, ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచిత నోట్‌బుక్స్ కూడా సరఫరా చేయడం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా మారిందన్నారు. అదేవిధంగా విద్యార్థులందరికీ ఉచిత యూనిఫాంలు అందించడం ప్రభుత్వం విద్య పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యార్థి సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత ఏడాదితో పోలిస్తే సుమారు 15 శాతం మేర అదనపు ప్రవేశాలు నమోదయ్యాయని, ఇంకా ప్రవేశ ప్రక్రియ కొనసాగుతుండటం ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులకు విశ్వాసం పెరిగినందుకు నిదర్శనమని తెలిపారు.

అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే కొన్ని కళాశాలల్లో రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందిస్తున్నారని గుర్తుచేశారు. ఈ పథకాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విస్తరించాలని ప్రభుత్వం భావించడం స్వాగతించదగ్గ పరిణామమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో చదువుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల అమలు వారి విద్యాభ్యాసానికి బలమైన తోడ్పాటునందిస్తుందని తెలిపారు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు వారి విద్యా ప్రమాణాలు, హాజరు శాతం, విద్యాపట్ల ఆసక్తి మరింత పెరిగి, భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించే అవకాశాలు మెరుగుపడతాయని శ్రీ చట్ల ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలు ఆదర్శప్రాయమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యార్థి సంక్షేమ చర్యలను మరింత విస్తరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చొక్కాల రాజేందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, తాళ్ల నరసయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కొండ గోవర్ధన్, ట్రెజరర్ గుండ్రెడ్డి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.