manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 3:59 pm Editor : manabharath

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయం..

మన భారత్, ఆదిలాబాద్, ఆగస్టు 1:

ఆరోగ్య పాఠశాల లక్ష్యాలను పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ రాజర్షి షా

పాఠశాలల్లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కేఆర్కే కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల, సిసి టివి ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా కృషి చేసి అరోగ్య పాఠశాల లక్ష్యాలను సాధించాలన్నారు. విద్యా సంవత్సరంలో ఉండే 220 పనిదినాలలో ప్రతి విద్యార్థి కనీసం 200 రోజులు ఖచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలని స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. పండుగలు, శుభకార్యాలకు కేటాయించిన సమయం మినహా, మిగతా రోజుల్లో క్రమం తప్పకుండా బడికి వస్తేనే ఎఫ్‌ఎల్‌ఎన్ మెరుగవడంతో పాటు పదో తరగతి ఫలితాలు, గురుకుల సీట్లు సాధించవచ్చని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచగలిగితే, జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ ప్రత్యేక సర్దుబాటు ద్వారా వంద శాతం మరొక అదనపు టీచర్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం అంశాల్లో ప్రాథమిక సామర్థ్యాలు పెంచేందుకు మధ్యాహ్నం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలను ‘ఎఫ్.ఎల్.ఎన్ కాంపిటెంట్ పాఠశాల’గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. వీటితో పాటు ప్రతిరోజూ నిర్వహించే ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తూ విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చాలన్నారు. విద్యార్థుల పోషకాహారం కోసం త్వరలోనే మధ్యాహ్న భోజనంతో పాటు హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు గుట్కా, గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, వ్యసనాలకు బానిసలైన వారిని గుర్తించి రిమ్స్‌లోని ‘డి-అడిక్షన్ సెంటర్’ ద్వారా ఉచిత చికిత్స అందించాలని కోరారు. ప్రభుత్వం అందించే బ్లూ యూనిఫామ్‌లు పిల్లలకు సరిగ్గా కుదిరేలా ఎస్.హెచ్.జి టైలర్ల ద్వారా ఆల్టరేషన్ చేయించాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పాఠశాలలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, అధికారులు ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలోని అంశాలపై పాటలు, ప్రసంగం, నాటికల రూపంలో అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను కలెక్టర్ శాలువాలతో సత్కరించి అభినందించారు.

అనంతరం పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి, నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సీసీ కెమెరాలు విరాళంగా ఇచ్చిన దాతలు మౌనీష్, శ్రీకాంత్ సేవలను, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న హెచ్‌ఎం నవీన్, ఉపాధ్యాయులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, కౌన్సిలర్లు రజిత, మాన్కర్ నాక్సేన్, ఆరోగ్య పాఠశాల పర్యవేక్షకులు అజయ్, కాంప్లెక్ హెచ్ఎం సాధన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ యాదవ్, ఏఏపిసి చైర్మన్ రజియా సుల్తానా, దాతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీ వాసులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి