manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 3:52 pm Editor : manabharath

గంజాయిపై యుద్ధం చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గంజాయిపై యుద్ధం చేయాలి.. మార్పుతోనే మాదకద్రవ్యాలకు చెక్

పిప్పర్వాడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. పూసాయిలో 17 సీసీటీవీల ప్రారంభం

15 మంది వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ.. విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ కిట్లు

వాలీబాల్ విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ అందజేసిన ఎస్పీ అఖిల్ మహాజన్

జైనథ్, ఆగస్టు 1 (మన భారత్, ఆదిలాబాద్): గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం శనివారం జైనథ్ మండలం పిప్పర్వాడ గ్రామంలో ఉత్సాహంగా జరిగింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ ప్రజలు, యువతతో నేరుగా మాట్లాడి పలు అంశాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో భాగంగా పిప్పర్వాడలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌ను పిప్పర్వాడ, హశీంపూర్ జట్ల మధ్య ఎస్పీ ప్రారంభించారు. అనంతరం మ్యాచ్‌ను పూర్తిగా తిలకించారు. పిప్పర్వాడ రామాలయం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమానికి చేరుకున్న ఎస్పీ అఖిల్ మహాజన్‌తో పాటు పోలీసు అధికారులకు గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

అభ్యుదయ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను వీక్షించిన ఎస్పీ వారిని అభినందించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడల ద్వారా ఆరోగ్యం, క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇండోర్ గేమ్స్ కిట్లను అందజేశారు.

పూసాయిలో 17 సీసీటీవీ కెమెరాల ప్రారంభం

ఈ కార్యక్రమంలో భాగంగా పూసాయి గ్రామంలో ఏర్పాటు చేసిన 17 సీసీటీవీ కెమెరాలను గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ప్రతి గ్రామం సీసీటీవీ నిఘాలో ఉంటే నేరాలను అరికట్టడంలో పోలీసులకు మరింత సహకారం లభిస్తుందని అన్నారు.

ఆదిలాబాద్ జిల్లాకు అంతర్రాష్ట్ర సరిహద్దు ఉండటంతో గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు మరింత ప్రాధాన్యత సంతరించుకుందని ఎస్పీ పేర్కొన్నారు. నేరం జరిగిన సమయంలో నిందితులను త్వరగా గుర్తించడంతో పాటు దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

గ్రామ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ.. సీసీటీవీలు ప్రజల రక్షణకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సీసీటీవీల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

గంజాయిపై సమిష్టిగా పోరాటం చేయాలి

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.

“గంజాయిపై యుద్ధం చేయాలి.. మార్పు ద్వారానే గంజాయిని సమాజం నుంచి దూరం చేయవచ్చు”అని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నా, మాదకద్రవ్యాల విక్రయాలకు పాల్పడుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత కీలకమని, గంజాయి రహిత సమాజ నిర్మాణమే జిల్లా పోలీసుల లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే గంజాయికి బానిసైన వారిని నిందించకుండా డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడంలో కుటుంబ సభ్యులు సహకరించాలని సూచించారు.

గంజాయి సాగుదారులపై కఠిన చర్యలు

గంజాయి సాగు, మాదకద్రవ్యాల వ్యాపారానికి పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. గంజాయి సాగు చేస్తున్న వారి వివరాలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసేలా సిఫార్సు చేస్తామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు నిరంతరం అవగాహన కల్పించాలని కోరారు.

జాబ్ ఫ్రాడ్‌లపై అప్రమత్తంగా ఉండాలి

జిల్లాలో ఇటీవల వెలుగులోకి వస్తున్న ఉద్యోగ మోసాలపై కూడా ఎస్పీ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు అడిగే వ్యక్తులు లేదా సంస్థలను నమ్మవద్దని సూచించారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి గురించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

అదేవిధంగా బైక్ మెకానిక్‌లు ఇంజిన్, ఛాసిస్ నంబర్లలో అక్రమంగా మార్పులు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

హెల్మెట్‌తోనే రహదారి భద్రత

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా 15 మంది వాహనదారులకు హెల్మెట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ పంపిణీ చేశారు. రహదారి భద్రతపై ప్రజలు, యువత మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

వాలీబాల్ విజేతలకు బహుమతుల ప్రదానం

రెండు రోజుల పాటు నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఎస్పీ నగదు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ అందజేసి అభినందించారు.

ప్రథమ బహుమతి: పిప్పర్వాడ గ్రామ జట్టు – నగదు బహుమతి, ట్రోఫీ ,ద్వితీయ బహుమతి: హశీంపూర్ గ్రామ జట్టు – నగదు బహుమతి, ట్రోఫీ

యువత క్రీడల వైపు మళ్లడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండవచ్చని ఎస్పీ పేర్కొన్నారు.

సుమారు 250 మంది పాల్గొనడం

‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు తమ సమస్యలు, భద్రతకు సంబంధించిన అంశాలను పోలీసు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్ కుమార్, ఎస్‌ఐలు పి. గౌతమ్, పీర్ సింగ్, పిప్పర్వాడ సర్పంచ్ సంతోష్ రెడ్డి, పూసాయి గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, యువత తో పాటు సుమారు 250 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.