manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 4:58 pm Editor : manabharath

సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు.. ముగ్గురిపై కేసు నమోదు

వాట్సాప్ గ్రూప్‌లో వివాదాస్పద పోస్టులపై పోలీసుల చర్యలు.. గ్రూప్ అడ్మిన్‌పై కూడా కేసు

ఆదిలాబాద్, జూలై 25: సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా, బెదిరింపులకు దారితీసేలా పోస్టులు ప్రచారం చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలకు పాల్పడిన ముగ్గురిపై ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలో ‘ఆదిలాబాద్ టైమ్స్’ పేరుతో నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూప్‌లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా, భయాందోళనలు కలిగించేలా పోస్టులు ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రాథోడ్ గజానన్, బండారి సంతోష్ పై కేసు నమోదు చేశారు. అదేవిధంగా గ్రూప్‌లో అభ్యంతరకరమైన పోస్టులు వచ్చినప్పటికీ వాటిని సమయానికి తొలగించకపోవడంతో గ్రూప్ అడ్మిన్ వేణుగోపాల్ యాదవ్ పై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు

సామాజిక మాధ్యమాల్లో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, బెదిరింపులకు పాల్పడే విధంగా పోస్టులు పెట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లు తమ బాధ్యతను గుర్తించి వ్యవహరించాలని సూచించారు. గ్రూపుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివాదాస్పద పోస్టులు లేదా ప్రజల్లో భయాందోళనలు కలిగించే సమాచారాన్ని గుర్తించిన వెంటనే తొలగించి, అవసరమైతే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడం తప్పదని స్పష్టం చేశారు

సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలి

సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా అనుమానాస్పద పోస్టులను ప్రచారం చేయవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇలాంటి పోస్టులు, కార్యకలాపాలు ఎవరైనా గుర్తించిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

నిందితులు:

1. వేణుగోపాల్ యాదవ్ – వాట్సాప్ గ్రూప్ అడ్మిన్

2. రాథోడ్ గజానన్

3. బండారి సంతోష్

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్