manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 4:10 am Editor : manabharath

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్

మన భారత్ | ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయానికి సంబంధించిన కేసులో ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామ సర్పంచ్ ఈశ్వర్‌పై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. వ్యవసాయాధికారుల నివేదిక, సంబంధిత శాఖల విచారణ ఆధారంగా సర్పంచ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అనంతరం సర్పంచ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర నివేదికను జిల్లా యంత్రాంగానికి సమర్పించారు.

ఈ నివేదిక ఆధారంగా జిల్లా పంచాయతీ అధికారి సర్పంచ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయగా, ఆయన సమర్పించిన వివరణ సంతృప్తికరంగా లేదని అధికారులు నిర్ధారించారు. దీంతో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల మేరకు సర్పంచ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నకిలీ విత్తనాల విక్రయం రైతులకు తీవ్ర నష్టం కలిగించే చర్యగా అధికారులు పేర్కొంటూ, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రైతులు ధృవీకరించిన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, అనుమానాస్పద విత్తనాలపై వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..