2027 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పూర్తి.. శాస్త్రీయ డిజైన్లతో పనులు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మన భారత్, హైదరాబాద్: తెలంగాణకు కీలకమైన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిస్థాయిలో పునరుద్ధరించి మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో ప్రభావం, నీటి లభ్యత పరిస్థితులు, సాగునీటి అవసరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ వివరాలు తెలిపారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై శాస్త్రీయ పరిశీలన పూర్తయిందని మంత్రి పేర్కొన్నారు. నిపుణుల సూచనల మేరకు బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన సాంకేతిక డిజైన్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ భద్రత, నీటి నిల్వ సామర్థ్యం, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక ప్రమాణాలతో పునర్నిర్మాణ చర్యలు చేపడతామని చెప్పారు.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. వచ్చే ఏడాది జూన్ వరకు అందుబాటులో ఉన్న జలాలను తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత క్రమంలో వినియోగించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయ రంగానికి జీవనాడిగా నిలిచిందని, దాని పునరుద్ధరణ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణయించిన గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో నీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి వినియోగంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. రాబోయే కాలంలో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్టాప్ రిపోర్టర్స్ నియోజకవర్గ ఇన్చార్జి లు మండల రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
