manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 2:56 am Editor : manabharath

వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి

ఎల్‌నినో ప్రభావం తీవ్రం.. వరి నాట్లకు దూరంగా ఉండండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మన భారత్, హైదరాబాద్:
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని, సాగునీటి సరఫరా చేయడం కష్టతరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు వరి నాట్లు వేయడం మంచిది కాదని మంత్రి సూచించారు. ముఖ్యంగా భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించాలని, వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అలాగే ప్రతి వర్షపు నీటి చుక్కను సంరక్షించేలా ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలని, వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకించే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు.

వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తూ ప్రభుత్వం రైతులకు అవసరమైన సూచనలు అందిస్తోందని, నీటి కొరత దృష్ట్యా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ పనులు చేపట్టడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్, నియోజకవర్గ ఇన్చార్జి లు, మండల రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.