manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 11:07 pm Editor : manabharath

పుట్ బోర్డు పై నడిచేది ఎలా.?

ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన దుకాణాలు నడకదారులకు తీవ్ర ఇబ్బందులు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ నుంచి ఠాకూర్ హోటల్ వరకు ప్రధాన రహదారిపై ఫుట్‌పాత్‌లను దుకాణాల సామగ్రితో ఆక్రమించడంతో నడకదారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌లు వ్యాపార అవసరాలకు వినియోగించబడుతున్న నేపథ్యంలో ప్రజలు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు.

గతంలో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించి ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కొంతమంది దుకాణ యజమానులు వాటిని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. షాపుల ముందు ఫుట్‌పాత్‌లపై సరుకులు, స్టాండ్లు, ప్రకటన బోర్డులు, ఇతర వస్తువులు ఉంచడం వల్ల పాదచారులు ఇబ్బందులు పడటమే కాకుండా ట్రాఫిక్ సమస్య కూడా మరింత తీవ్రమవుతోందని చెబుతున్నారు.

ప్రత్యేకించి పండుగల సమయంలో, వారాంతాల్లో, రద్దీ ఎక్కువగా ఉండే వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు తెలిపారు. ఫుట్‌పాత్‌లు పూర్తిగా ఆక్రమించబడటంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు రోడ్డుపైనే నడవాల్సి వస్తోందని, దీంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానిక వ్యాపారులు, ప్రజలు పేర్కొంటున్నారు. అప్పుడప్పుడు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టినా, కొద్ది రోజులకే మళ్లీ పాత పరిస్థితి నెలకొంటోందని వారు అంటున్నారు.

ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు, పాదచారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫుట్‌పాత్‌లను పూర్తిగా ఆక్రమణల నుంచి విముక్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజా రవాణా సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ, పాదచారుల భద్రత కోసం ఫుట్‌పాత్‌లు ప్రజలకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బాటసారులు అభిప్రాయపడుతున్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్