manabharath.com
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 8:43 pm Editor : manabharath

షెడ్డు నిర్మించాలని గ్రామస్తుల వినతి..

దేగామా హనుమాన్ మందిరం ముందు షెడ్డు నిర్మించాలి: గ్రామస్థుల డిమాండ్

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండల కేంద్రంలోని ప్రముఖ దేగామా హనుమాన్ మందిర్ ఆలయం ముందు తక్షణమే కమ్యూనిటీ షెడ్డు నిర్మించాలని స్థానిక గ్రామస్థులు, ఆదివాసి పెద్దలు అధికారులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య వేధిస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండనక, వాననక వివాహాలు.. ఆదివాసి సంప్రదాయాలకు ఇబ్బందులు

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా, నాయకులు ఓట్ల సమయంలో హామీలు ఇస్తున్నా దేగామా ఆలయ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. ఆదివాసుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల ప్రకారం ఈ హనుమాన్ ఆలయ ప్రాంగణంలోనే వివాహాలు జరిపించడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఒక ఆనవాయితీ. అయితే, ఆలయం ముందు సరైన షెడ్డు లేకపోవడం వల్ల పెళ్లిళ్ల సమయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వేసవిలో మండుటెండల్లో, వర్షాకాలంలో కురుస్తున్న భారీ వర్షాల నడుమ షెడ్డు లేక పెళ్లిళ్లు చేసుకోవడం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కూర్చోవడానికి స్థలం కరువైంది..

ఆలయానికి వచ్చే భక్తులకు, పెళ్లిళ్లకు హాజరయ్యే బంధువులకు కనీసం కూర్చోవడానికి కూడా స్థలం లేదని, వర్షం వస్తే తలదాచుకోవడానికి చెట్ల కిందకు పరుగులు తీయాల్సి వస్తోందని గ్రామ పెద్దలు, యువకులు వివరించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ మరియు ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక నిధులు మంజూరు చేసి, దేగామా హనుమాన్ మందిరం ముందు పెద్ద షెడ్డు నిర్మించాలని కోరారు.

ఈ నిరసన, డిమాండ్ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు, గ్రామ పెద్దలు ఆత్రం అంకుష్, సోయం సుభాష్, అడు నగరోవ్ పటేల్, దుర్వ సూర్యభన్ లతో పాటు మండల కేంద్రానికి చెందిన పలువురు ప్రముఖులు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..