manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 9:05 am Editor : manabharath

శిథిలావస్థలో వ్యవసాయ శాఖ భవనం..

శిథిలావస్థలో తలమడుగు వ్యవసాయ శాఖ భవనం..

కొత్త భవనం మంజూరుకు రైతులు, గ్రామస్తుల విజ్ఞప్తి

మన భారత్ | తలమడుగు

తలమడుగు మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అదే పాత భవనంలో వ్యవసాయ శాఖ కార్యకలాపాలు కొనసాగుతున్నప్పటికీ, కొత్త భవనం నిర్మాణంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా వ్యవసాయ శాఖకు శాశ్వత భవనం నిర్మాణం మాత్రం కలగానే మిగిలిందని గ్రామస్తులు పేర్కొన్నారు. శిథిలమైన భవనంలో పనిచేయడం ప్రమాదకరంగా మారిందని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోందని తెలిపారు. భారీ వర్షాలు కురిసినప్పుడు భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలంలో ఎరువులు, పురుగుమందుల బస్తాలను భద్రపరచడం తీవ్ర సమస్యగా మారిందన్నారు. భవనం పైకప్పు దెబ్బతినడంతో వర్షపు నీరు లోపలికి చేరి సామగ్రి దెబ్బతినే పరిస్థితి నెలకొంటోందని వివరించారు. ఉద్యోగులు కూడా భయాందోళనల మధ్య విధులు నిర్వహించాల్సి వస్తోందన్నారు.

ప్రస్తుతం రైతులకు అవసరమైన సేవలను తాత్కాలికంగా రైతు వేదిక నుంచి అందిస్తున్నామని, అయితే వ్యవసాయ శాఖకు సొంత ఆధునిక భవనం ఉంటే రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించవచ్చని ప్రమోద్ రెడ్డి తెలిపారు.

రైతులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తలమడుగు వ్యవసాయ శాఖ కార్యాలయానికి కొత్త భవనం మంజూరు చేసి నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరుతున్నారు. రైతుల సంక్షేమానికి కీలకమైన వ్యవసాయ శాఖ కార్యాలయం సురక్షితమైన భవనంలో పనిచేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..