manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 11:54 pm Editor : manabharath

100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాల పంపిణీ

మన భారత్ | తాంసి

మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (MCP) కింద 100 శాతం సబ్సిడీతో పత్తి విత్తనాల పంపిణీ

అధిక దిగుబడులే లక్ష్యం.. హెచ్‌డీపీఎస్, క్లోజర్ స్పేసింగ్ విధానాలతో సాగుకు రైతులకు అవగాహన

తాంసి, జూలై 2 (మన భారత్): పత్తి సాగులో దిగుబడులు పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (MCP) – కపాస్ కాంతి పథకం కింద తాంసి మండలంలోని కప్పర్ల రైతు వేదికలో గురువారం రైతులకు 100 శాతం సబ్సిడీపై పత్తి విత్తనాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.

వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ, హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ (HDPS)అంటే అధిక సాంద్రతలో పత్తి సాగు, అలాగే క్లోజర్ స్పేసింగ్ (దగ్గర దగ్గర మొక్కలు నాటే విధానం) ద్వారా ఎకరాకు మొక్కల సంఖ్య పెరిగి, పత్తి దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విధానాలను రైతులు విస్తృతంగా అనుసరించడం ద్వారా సాగు ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడులు సాధించే అవకాశముందని తెలిపారు.

ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ విత్తనాలను పూర్తిగా ఉచితంగా అందజేస్తోందని, శాస్త్రీయ సాగు పద్ధతులను పాటిస్తే నాణ్యమైన పత్తి ఉత్పత్తితో పాటు మెరుగైన ఆదాయం పొందవచ్చని అధికారులు సూచించారు.

పంపిణీ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, కప్పర్ల గ్రామ సర్పంచ్ గండ్రత్ అరుణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి ఎ. రవీందర్, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) నరేందర్ తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతులకు విత్తనాల వినియోగం, సాగు విధానాలు, పంట నిర్వహణపై వ్యవసాయ శాఖ అధికారులు పలు సూచనలు చేశారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.