manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 2:25 pm Editor : manabharath

ప్రాథమిక విద్యను కాపాడాలి..

మన భారత్, తలమడుగు:

ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను వాయిదా వేయాలి

జీవో నెం.25 సవరణకు ఎంఎల్‌సీకి వినతి

తెలంగాణ: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఉపాధ్యాయుడు కలవల శంకర్ మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు మల్క కొమరయ్యకి వినతిపత్రం సమర్పించారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే అనేక చోట్ల ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధిస్తూ, మధ్యాహ్న భోజన పథకం, ఆన్‌లైన్ పనులు, రికార్డుల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు వంటి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

ప్రాథమిక విద్య దేశ విద్యా వ్యవస్థకు పునాది అని, చిన్నారులకు నాణ్యమైన విద్య అందాలంటే ప్రతి పాఠశాలలో అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల సర్దుబాటు అంశం కేవలం ఉద్యోగ సమస్య మాత్రమే కాకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను 31-07-2026 వరకు వాయిదా వేసి, క్షేత్రస్థాయి అధ్యయనం అనంతరం మాత్రమే అమలు చేయాలని, అలాగే జీవో నెం.25ను సవరించి ప్రాథమిక విద్యకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంఎల్‌సీని కోరారు.

విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో కనీస ఉపాధ్యాయుల సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..