manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 8:46 pm Editor : manabharath

రోడ్డుపై మురుగు నడిచేది ఎలా..?

నాలీలు లేక రోడ్లపైకి మురుగు నీరు.. ఝరి గ్రామస్తుల అవస్థలు

చెత్త, వర్షపు నీటితో రోడ్లు అధ్వానంగా మారాయి

– అధికారులు స్పందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి

మన భారత్, ఆదిలాబాద్:

తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో నాలీలు నిర్మించకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు, స్నానం చేసిన నీరు, బట్టలు ఉతికిన నీరు నేరుగా రోడ్లపైకి చేరుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని తెలిపారు.

అంతేకాకుండా గ్రామం మధ్యలో ఉన్న ప్రధాన రహదారి కూడా పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని గ్రామస్తులు పేర్కొన్నారు. వర్షం పడిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను, వృద్ధులను తరలించడంలో కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు.

గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన నాలీల నిర్మాణం చేపట్టి, దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ ఈ సమస్యను వెంటనే గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.