manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 June 2026, 3:49 pm Editor : manabharath

అగ్రకులాల ఆధిపత్యమేనా..?

ఫీజు రీయంబర్స్మెంట్ రద్దుకు కుట్ర

పాత్రికేయుల సమావేశంలో వేముల మహేందర్ గౌడ్ వెల్లడి

మన భారత్,మొగుళ్ళపల్లి:

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ వెల్లడించారు. ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినప్పటికీ, వచ్చిన తెలంగాణలో పిడికెడు శాతం లేని అగ్రకులాలే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 24 మంది ఉంటే..తెలంగాణ రాష్ట్రం వచ్చాక 19 మంది అయ్యారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదుగురు బీసీ మంత్రులు ఉంటే..ప్రస్తుతం ముగ్గురే ఉన్నారని తెలిపారు. 2008లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా అమలు చేశారని, తెలంగాణ వచ్చాక పథకాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై బీసీ సంక్షేమ సంఘం తిరుగులేని పోరాటం చేస్తుందని హెచ్చరించారు.