manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 4:47 pm Editor : manabharath

మతసామరస్యానికి ప్రతీకగా పీర్ల పండుగ

రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని దర్శించుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మతసామరస్యానికి ప్రతీకగా రుయ్యాడి పీర్ల పండుగ: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మొహారం వేడుకలు

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో ప్రసిద్ధి చెందిన హాసేన్ హుసేన్ దేవస్థానాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి గ్రామస్తులతో కలిసి మొహారం వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రుయ్యాడి హాసేన్ హుసేన్ దేవస్థానం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిందన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి జరుపుకునే పండుగ మొహారం అని పేర్కొన్నారు.

రుయ్యాడి పీర్ల పండుగ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. పీర్ల పండుగ సమయంలో గ్రామ ప్రజలు ఐక్యతతో, భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు ఎక్కడ ఉన్నా తిరిగి స్వగ్రామానికి చేరుకుని వేడుకల్లో పాల్గొనడం రుయ్యాడి ప్రత్యేకత అని అన్నారు. పీర్ల పండుగ వచ్చిందంటే గ్రామ ప్రజలు ఎంతో నియమ నిష్టలతో మొహారం పూర్తయ్యే వరకు చెప్పులు ధరించకుండా భక్తితో పాల్గొంటారని తెలిపారు.

బోథ్ నియోజకవర్గంలో ఇలాంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం ఉండటం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వచ్చే ఏడాది మరింత ఘనంగా రుయ్యాడి పీర్ల పండుగ నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.