manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 2:39 am Editor : manabharath

హరీశ్ రావు ఆరోపణలపై మంత్రుల ఘాటు స్పందన

సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్

రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు అవాస్తవం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

మన భారత్, సిద్ధిపేట:

సంక్షేమ శాఖల్లో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, వాటిని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా, చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రోడ్లు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా అజారుద్దీన్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంక్షేమ శాఖల పనితీరులో పూర్తి పారదర్శకత ఉండేలా నిర్ణయాధికారాలను సంబంధిత శాఖల ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌కు అప్పగించామని వివరించారు.

ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. అయితే వాస్తవాలు తెలుసుకోకుండా హరీశ్ రావు విమర్శలు చేయడం ద్వారా తన రాజకీయ స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అవసరమైతే ఏ సంస్థతోనైనా విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

హరీశ్ రావుకు అక్కసు ఎందుకు? – మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా తీవ్రంగా ఖండించారు. గురుకుల విద్యార్థుల కోసం షూస్, యూనిఫాంలు, పుస్తకాల కొనుగోలులో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని అన్నారు.

ఈ విషయంపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని హరీశ్ రావుకు సవాల్ విసిరారు. ప్రభుత్వం జాతీయ స్థాయిలో పారదర్శక టెండర్లు పిలిచిందని, మొత్తం టెండర్ విలువ కేవలం రూ.687 కోట్లేనని వివరించారు. అలాంటప్పుడు రూ.2 వేల కోట్ల అవినీతి ఎలా జరిగిందో హరీశ్ రావు ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.

ప్రభుత్వం గురుకుల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెరుగైన నాణ్యతతో వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఏడు లక్షల మంది విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే దానిపై కూడా విమర్శలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని అన్నారు.

అంతేకాకుండా బీఆర్ఎస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ఎన్ని కొత్త హాస్టళ్లు నిర్మించారో, ఎన్ని గురుకుల భవనాలు ఏర్పాటు చేశారో చెప్పాలని హరీశ్ రావును నిలదీశారు. ప్రభుత్వ సంస్థలకు కూడా కొనుగోళ్లలో ప్రాధాన్యం కల్పిస్తూ పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

రాజకీయ వర్గాల్లో చర్చ..

హరీశ్ రావు చేసిన ఆరోపణలు, వాటిపై మంత్రుల ప్రతిస్పందనలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సంక్షేమ శాఖల పనితీరు, గురుకులాల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ప్రభుత్వం పారదర్శకతకు కట్టుబడి ఉందని, అవసరమైతే అన్ని ఆరోపణలపై విచారణకు సిద్ధమని మంత్రులు స్పష్టం చేయడం గమనార్హం.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..