మత్తు పదార్థాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని ఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, యువతపై ప్రభావం చూపే వ్యక్తులు ముందుకు వచ్చి మత్తు వ్యసన నిర్మూలనలో భాగస్వాములు కావాలని సూచించారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని నేరస్తులుగా చూడకుండా, సరైన వైద్య సహాయం మరియు కౌన్సెలింగ్ ద్వారా తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అలాంటి వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేస్తే, డి-అడిక్షన్ సెంటర్ల ద్వారా అవసరమైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ప్రజల సహకారంతో జిల్లాలో మత్తు పదార్థాలకు స్థానం లేకుండా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
యువత ఆరోగ్యకరమైన మార్గంలో నడిచి విద్య, ఉపాధి, అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఎస్పీ ఆకాంక్షించారు. గంజాయి రహిత ఆదిలాబాద్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
