manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 9:59 am Editor : manabharath

విద్యా హక్కు చట్టం ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

డీఈవోకు ముస్లిం యువజన సంఘం వినతిపత్రం

ఆర్టీఈ నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ-2009) నిబంధనలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ముస్లిం యువజన సంఘం ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ, విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చే ధోరణి కొంతమంది ప్రైవేట్ విద్యాసంస్థల్లో పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో డొనేషన్లు వసూలు చేయడం విద్యా హక్కు చట్టం ఉద్దేశాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, కవర్లు, స్టేషనరీ వస్తువులు ఇతర దుకాణాల్లో కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా యాజమాన్యాలే విక్రయిస్తున్నాయని ఆరోపించారు. దీంతో ఒక్కో విద్యార్థి కోసం తల్లిదండ్రులు రూ.2,000 నుంచి రూ.4,000 వరకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది తీవ్ర భారంగా మారుతోందని తెలిపారు.

విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా కేటాయించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. అయితే జిల్లాలోని అనేక పాఠశాలలు ఈ నిబంధనను సక్రమంగా అమలు చేయడం లేదని ఆరోపించారు. అర్హులైన పేద విద్యార్థులకు ప్రవేశాలు నిరాకరించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై విచారణ జరపాలని కోరారు.

విద్య అనేది ప్రతి చిన్నారి హక్కు అని, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరూ విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఆర్‌టీఈ చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. అలాంటి చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరుగుతుందని అన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాలని, డొనేషన్ల వసూళ్లు, పుస్తకాల విక్రయాలు, ఆర్‌టీఈ కోటా అమలు వంటి అంశాలను పరిశీలించాలని వినతిపత్రంలో కోరారు. విద్యా హక్కు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయడం ద్వారా పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పైసల్ అహ్మద్, మహమ్మద్ మోసిన్, సయ్యద్ సాజిద్, షోహెబ్, అమీర్ తదితర ముస్లిం యువజన సంఘం సభ్యులు పాల్గొని విద్యా హక్కు చట్టం అమలుపై అధికారుల దృష్టిని ఆకర్షించారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్..

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..