manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 9:21 am Editor : manabharath

రహదారి సమస్య పరిష్కరించాలని గ్రామస్థుల విజ్ఞప్తి

రత్నాపూర్ గ్రామసభలో గ్రామాభివృద్ధిపై చర్చలు

– రహదారి సమస్య పరిష్కరించాలని గ్రామస్థుల విజ్ఞప్తి

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రత్నాపూర్ గ్రామంలో గ్రామసభను సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ఆరోగ్య పరిరక్షణ, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామసభలో ప్రస్తావిస్తూ, ముఖ్యంగా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలంలో రహదారులు మరింత దెబ్బతిని రాకపోకలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సైతం గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన సమస్యలను కూడా గ్రామస్థులు ప్రస్తావించారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి గ్రామానికి వెంటనే రహదారి మార్గం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఆత్రం సులోచన నరేష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో నీరు కలుషితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తప్పనిసరిగా వేడిచేసిన నీటినే తాగాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని చెప్పారు.

సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, సేవల వివరాలను ప్రజలకు వివరించారు. విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

గ్రామసభలో గ్రామస్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని సంకల్పించారు.