manabharath.com
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 3:39 pm Editor : manabharath

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం

మరుగుతున్న ఉక్కు కార్మికులపై పడి 10 మందికి తీవ్ర గాయాలు.. సహాయక చర్యలు ముమ్మరం

మన భారత్ | విశాఖపట్నం

విశాఖపట్నంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మంగళవారం ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ (SMS)-2 విభాగంలో మరుగుతున్న లిక్విడ్ ఉక్కును తరలించే సమయంలో ప్రమాదవశాత్తు మోల్టెన్ మెటల్ లాడెల్‌కు సంబంధించిన బకెట్లు కుప్పకూలడంతో ఈ ఘటన జరిగింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, భారీ ఉష్ణోగ్రతల వద్ద ఉన్న లిక్విడ్ ఉక్కు ఒక్కసారిగా కార్మికులపై చిందరగోళంగా పడటంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ప్లాంట్ అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్‌లో అత్యవసర హెచ్చరికలు జారీ చేయగా, ఫైర్ సిబ్బంది, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ ఘటనతో స్టీల్ ప్లాంట్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా లేదా యంత్రాల నిర్వహణలో ఏవైనా సమస్యలున్నాయా అనే కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు.

ప్రమాదంపై ప్లాంట్ యాజమాన్యం స్పందిస్తూ గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఈ ఘటనతో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..