manabharath.com
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 10:48 am Editor : manabharath

రూ.50 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

పోస్టల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి – రూ.50 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

మన భారత్, గజపతినగరం: ప్రజల ఆర్థిక భద్రతకు పోస్ట్ ఆఫీస్ పొదుపు, బీమా పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతినగరంలోని ఉషా కన్వెన్షన్‌లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్టల్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ సేవలపై ప్రజల్లో విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందన్నారు. పొదుపు పథకాలు, బీమా సేవలు, కొరియర్ సదుపాయాల ద్వారా పోస్టల్ శాఖ ప్రజలకు మరింత చేరువవుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు పోస్టల్ సిబ్బంది కష్టపడి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న తీరు అభినందనీయమన్నారు.

ప్రమాద బీమా పథకాల ప్రాముఖ్యతను వివరిస్తూ, తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో భీమా రక్షణ లభించడం కుటుంబాలకు అత్యవసర సమయంలో అండగా నిలుస్తుందని చెప్పారు. కేవలం రూ.2,600 ప్రీమియంతో రూ.50 లక్షల ప్రమాద బీమా లభించడం సామాన్య కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పోస్టల్ బీమా పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షల ప్రమాద బీమా నమూనా చెక్కును బాధిత కుటుంబానికి మంత్రి అందజేశారు. అలాగే పోస్టల్ పొదుపు పథకాలను వినియోగిస్తున్న ఉత్తమ ఖాతాదారులకు పాస్‌బుక్స్ అందించి అభినందించారు.

అనంతరం 2025–26 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోస్టల్ శాఖ ఉద్యోగులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో సిబ్బంది పాత్ర కీలకమని, వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాసు, ఐపీపీబీ ప్రాంతీయ అధికారి సురేష్ వి.పి, సబ్ డివిజన్ ఇన్‌స్పెక్టర్ బి. ఉపేంద్ర, ఐపీపీబీ బ్రాంచ్ మేనేజర్ సీహెచ్. సతీష్, సబ్ పోస్టుమాస్టర్లు, పోస్టల్ అసిస్టెంట్లు, బ్రాంచ్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోస్టల్ శాఖ అందిస్తున్న సేవలు, భీమా పథకాలు, పొదుపు అవకాశాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..