మన భారత్, ఆదిలాబాద్:
వర్షాకాల వ్యాధుల నివారణకు పశువులకు టీకాల శిబిరం ప్రారంభం
దేవాపూర్ రాధే రాధే గోశాలలో జిల్లా పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యక్రమం
తలమడుగు: వర్షాకాలంలో పశువులకు సోకే ప్రమాదకర అంటువ్యాధులను నివారించేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని శనివారం దేవాపూర్ గ్రామంలోని రాధే రాధే గోశాలలో ప్రారంభించారు. పశుసంపద రక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పశుపోషకుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ టీకాల శిబిరాన్ని జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రామారావు రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో పశువుల్లో గొంతు వాపు (HS), జబ్బ వాపు (BQ) వంటి అంటువ్యాధులు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంటుందని తెలిపారు. అందువల్ల రైతులు, పశుపోషకులు తమ పశువులకు తప్పనిసరిగా ముందస్తు టీకాలు వేయించాలని సూచించారు.
వ్యాధుల నివారణ ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు రైతులు ఆర్థిక నష్టాలను కూడా నివారించవచ్చని ఆయన అన్నారు. పశుసంపద గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని, వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాల కార్యక్రమాలను ప్రతి పశుపోషకుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశువుల్లో వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే సమీప పశు వైద్యశాలను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తలమడుగు మండల పశు వైద్యాధికారి డాక్టర్ లావణ్య, పశు వైద్యుడు డాక్టర్ సతీష్, దేవాపూర్ పశు వైద్యశాల సిబ్బంది పి. అరుణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గోపాల్ మిత్రలు, గోశాల నిర్వాహకులు, పశుపోషకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
శిబిరంలో పశువులకు ఉచితంగా టీకాలు అందించడంతో పాటు, వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు, పశువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. వర్షాకాలం ముగిసే వరకు మండలంలోని పలు గ్రామాల్లో ఇలాంటి టీకాల శిబిరాలను నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
