manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 5:43 am Editor : manabharath

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం: 

రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు

గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో శుక్రవారం ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎస్సై నారాయణరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించడం తప్పనిసరి అని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా లింకులు, ఆన్‌లైన్ ఆఫర్లను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా సమాచారం ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన ఎస్సై, సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సమాజ భద్రత, యువత భవిష్యత్తు, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొంటూ, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..