manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 12:43 pm Editor : manabharath

ఘనంగా పర్యావరణ దినోత్సవం..

మన భారత్, తాంసి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొన్నారిలో గ్రామసభ – మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

తాంసి, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తలమడుగు మండలంలోని పొన్నారి గ్రామంలో గ్రామసభ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటి సంరక్షణకు గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.

గ్రామసభలో మాట్లాడిన ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి సంపదను అందించాలంటే ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల తగ్గుదల వంటి సమస్యలను అధిగమించడానికి చెట్ల పెంపకం అత్యంత అవసరమని గ్రామసభలో అభిప్రాయపడ్డారు. ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను తీసుకుంటే గ్రామం పచ్చదనంతో కళకళలాడుతుందని తెలిపారు.

మొక్కలు మనకు ప్రాణవాయువును అందించడమే కాకుండా వర్షపాతం పెరగడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణలో యువత, మహిళలు, విద్యార్థులు ముందుండి పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమన్న, ఉపసర్పంచ్ రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి గంగన్న, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొని మొక్కలు నాటారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..