మన భారత్, గుజరాత్:
14 ఏళ్ల బాలికపై తండ్రి లైంగిక దాడి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
నవసారి, జూన్ 5: గుజరాత్ రాష్ట్రంలోని నవసారి జిల్లాలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె తండ్రే పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, మే 9, 10, 11 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు నిందితుడు తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఎవరికి చెప్పినా ప్రాణాలు తీస్తానంటూ బాలికను బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది.
అంతేకాకుండా, జరిగిన విషయం బయటపడకుండా ఉండేందుకు బాలికకు గర్భనిరోధక మాత్రలు మింగించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అనంతరం బాలిక తన తల్లికి జరిగిన విషయాన్ని తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడిని కొద్దిగంటల్లోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని, బాధిత బాలికకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
