manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 9:29 am Editor : manabharath

మిర్యాలగూడలో విషాదం.. సిలిండర్ పేలుడుతో ముగ్గురు సజీవ దహనం

మన భారత్, నల్గొండ:

అమ్మమ్మ, మనవడు, మనవరాలు మృతి – షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం అనంతరం గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం కావడం స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మిర్యాలగూడలోని కలాల్‌వాడ ప్రాంతానికి చెందిన చంద్రకళ తన మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)తో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ధనమ్మ తన ఇద్దరు పిల్లలతో తల్లి చంద్రకళ వద్దే నివాసం ఉంటోంది. ఇటీవల ఉపాధి కోసం ధనమ్మ పుణెకు వెళ్లింది.

గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది.

సిలిండర్ పేలుడు కారణంగా చంద్రకళ, లక్ష్మణ్, ప్రణతి మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర శ్రమ అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా లేదా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కలాల్‌వాడ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..