manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 5:31 am Editor : manabharath

ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ..

మన భారత్, బొండపల్లి:

బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాల నుంచి పాల్గొన్న 170 మంది ఉపాధ్యాయులు

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యా బలోపేతం లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిక్షణలో బొండపల్లి, గజపతినగరం, మెంటాడ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ మరియు 2వ తరగతులకు బోధిస్తున్న సుమారు 170 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యం నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (FLN) పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణలో బోధనాపరమైన సమస్యలు, తరగతి గదిలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చించి, వాటిని బోధనలో అమలు చేయాలని సూచించారు.

తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలతో పాటు గణితంలో చతుర్విధ ప్రక్రియలను విద్యార్థులు మూడో తరగతికి చేరుకునేలోపే పూర్తిస్థాయిలో నేర్చుకునేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈ శిక్షణను సమర్థవంతంగా వినియోగించుకుని, తరగతి గదిలో దాని ప్రభావం స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

గత విద్యా సంవత్సరంలో గవర్నమెంట్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (GFLN) కార్యక్రమం ద్వారా సాధించిన ఫలితాల కంటే ఈసారి మరింత మెరుగైన ప్రగతి సాధించి 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నాణ్యమైన బోధన అందిస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాలని సూచించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో మూడు మండలాల నుంచి ఎంపికైన తొమ్మిది మంది రిసోర్స్ పర్సన్స్ శిక్షణ అందిస్తున్నారు. వారు ఆధునిక బోధనా పద్ధతులు, అభ్యాస లోపాల గుర్తింపు, విద్యార్థి కేంద్రిత బోధన, ఫౌండేషనల్ లెర్నింగ్ అంశాలపై ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తున్నారు.

శిక్షణ నిర్వహణలో సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, వెన్యూ ప్రధానోపాధ్యాయులు, వెన్యూ ఇన్‌చార్జిలు కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్యక్రమంలో బొండపల్లి మండల విద్యాశాఖ అధికారులు కే. శోభారాణి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంపొందించి విద్యార్థులకు బలమైన పునాది అందించడంలో ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి