manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 1:46 am Editor : manabharath

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే

తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు..

తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ సీఎం

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో జనసేన పార్టీ బలంగా కొనసాగుతుందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ దేశంలో అంతర్భాగమని పేర్కొన్న పవన్ కల్యాణ్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారే నేడు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవించే పార్టీగా జనసేన ఎప్పుడూ నిలుస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణపై ఉన్న గౌరవానికి గుర్తుగానే కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి కోట్ల రూపాయల విరాళం అందించినట్లు గుర్తుచేశారు. “మీ తాటాకు చప్పుళ్లకు జనసేన భయపడదు. భయపడేవాడినైతే రాజకీయ పార్టీనే స్థాపించేవాడిని కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా మొదటగా స్పందించే పార్టీ జనసేనేనని స్పష్టం చేశారు.

తన రాజకీయ కార్యకలాపాలు కేవలం ఓట్ల కోసమో, రాజకీయ లబ్ధి కోసమో కాదని, తెలంగాణపై ఉన్న ప్రేమ, మమకారంతోనే పనిచేస్తున్నానని చెప్పారు. గుంటూరులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినప్పుడు కూడా స్వాగతించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలంగాణలో ఏదైనా చేసినా తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుందా అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్, తాను ఎప్పుడూ తెలంగాణను అవమానించలేదని పేర్కొన్నారు. తనపై ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోనని, భయపడే స్వభావం తనకు లేదని తెలిపారు.

తెలంగాణలో ఉపాధి సమస్యలకు తాను కారణం కాదని పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను విమర్శించడం ద్వారా సమస్యలు పరిష్కారం కావని రాజకీయ నాయకులకు సూచించారు. మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ రావడాన్ని గుర్తు చేస్తూ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకు వ్యక్తిగత గౌరవం ఉందని పేర్కొన్నారు. తన ఫామ్‌హౌస్‌పై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అది అక్రమ ఆక్రమణ అని నిరూపితమైతే రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించేందుకు సిద్ధమని ప్రకటించారు.

ప్రజా గాయకుడు గద్దర్‌తో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్న పవన్ కల్యాణ్, ఆయనపై కాల్పులు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదని తనను విమర్శిస్తున్న రాజకీయ నాయకులను ప్రశ్నించారు. గద్దర్ జీవించి ఉన్నప్పుడు ఆయన కోసం మాట్లాడని వారు ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.