manabharath.com
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 3:23 pm Editor : manabharath

వ్యవసాయ బావిలో పడి పులి మృతి..

దుర్వాసన రావడంతో బయటపడిన ఘటన.. శవపరీక్ష అనంతరం ఖననం

మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి అటవీ పరిధిలోని చారగావ్ గ్రామ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ఓ ఆడపులి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సోమవారం రైతు పాండురంగ తన వ్యవసాయ క్షేత్రంలోని బావి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి బావిలోకి పరిశీలించగా పులి కళేబరం కనిపించింది. వెంటనే ఆయన అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో ఉన్న పులి కళేబరాన్ని బయటకు తీశారు. అనంతరం నిర్వహించిన ప్రాథమిక విచారణలో మృతి చెందినది సుమారు ఎనిమిదేళ్ల వయస్సు గల ఆడపులి అని గుర్తించారు.

అధికారులు పులి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి, నిబంధనల ప్రకారం అక్కడే ఖననం చేశారు. పులి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు శవపరీక్ష నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో అటవీ ప్రాంతాల సమీపంలోని వ్యవసాయ బావులకు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరంపై మరోసారి చర్చ మొదలైంది. అడవి జంతువులు ప్రమాదవశాత్తు బావుల్లో పడకుండా భద్రతా కంచెలు, రక్షణ వలలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..