మన భారత్ | ఆదిలాబాద్
మట్టి నమూనాల సేకరణ
– శాస్త్రీయ వ్యవసాయానికి తొలి అడుగు
ఆదిలాబాద్ జిల్లా భీంసారి గ్రామంలో బీసీఐ కేశవాపూర్ ఎఫ్పీసీఎల్ (FPCL) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను సేకరించి, మట్టి పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా వివరించారు.
కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, మట్టి పరీక్షల ద్వారా భూమిలోని పీహెచ్ (pH) స్థాయి, సేంద్రియ కార్బన్ శాతం, ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు మరియు రసాయన ఎరువుల లభ్యత వంటి అంశాలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చని తెలిపారు. మట్టి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, ఆ నివేదిక ఆధారంగా ఎరువుల వినియోగాన్ని నిర్ణయిస్తే పంట దిగుబడులు పెరగడంతో పాటు రైతుల పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు.
ప్రతి రైతు కనీసం సంవత్సరానికి ఒకసారి తమ వ్యవసాయ భూములకు మట్టి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మట్టి పరీక్షల నివేదిక ఆధారంగా అవసరమైన పరిమాణంలో మాత్రమే ఎరువులు వినియోగించడం వల్ల నేల సారం కాపాడబడటంతో పాటు అధిక రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
అలాగే పంట కోత అనంతరం మిగిలే పంట వ్యర్థాలను కాల్చివేయకుండా భూమిలో కలపడం లేదా సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగించాలని రైతులకు సూచించారు. దీంతో నేలలో సేంద్రియ పదార్థాల శాతం పెరిగి భూమి ఉత్పాదకత మెరుగుపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని మట్టి నమూనాల సేకరణ విధానం, మట్టి పరీక్షల ప్రక్రియ, భూమి ఆరోగ్య కార్డుల ఉపయోగం వంటి అంశాలపై అవగాహన పొందారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి సాయి పాల్గొని రైతుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించి, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰
