manabharath.com
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 9:38 am Editor : manabharath

కాంగ్రెస్ బీఎల్‌ఏ-2ల సమావేశం విజయవంతం

మన భారత్ | ఆదిలాబాద్

ఓటు హక్కుల పరిరక్షణకు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి: డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్

ప్రజలకు ఇంధన పొదుపు చెబుతూ తాము భారీ కాన్వాయ్‌లలో తిరుగుతున్న బీజేపీ నేతలు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్స్‌లో ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ-2ల సమావేశం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఆదిలాబాద్-బోత్ నియోజకవర్గాల పరిశీలకులు రమేష్ బాబు, ఒబేదుల్లా కొత్వాల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి పార్టీ కార్యకర్తల కృషి ప్రధాన కారణమని అన్నారు. ఓటరు జాబితాల పరిశీలనలో బీఎల్‌ఏ-2ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, కాంగ్రెస్ అనుకూల ఓట్లు గల్లంతు కాకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారు 90 వేల ఓట్లు, బోత్ నియోజకవర్గంలో 64 వేల ఓట్ల మ్యాపింగ్ పూర్తి కాలేదని వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పని చేయాలని పిలుపునిచ్చారు.

రైతుల సమస్యలపై స్పందించిన డా. నరేష్ జాదవ్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల అమలులో లోపాలు ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంటల కొనుగోలుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇంధన పొదుపు గురించి చెప్పే బీజేపీ నాయకులు తాము మాత్రం భారీ కాన్వాయ్‌లతో ప్రయాణిస్తున్నారని విమర్శించారు.

ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు, ఆదిలాబాద్‌లో విశ్వవిద్యాలయం స్థాపన వంటి అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమావేశంలో ఓటరు జాబితాల పరిశీలన, పార్టీ బలోపేతం, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించారు.

గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰