manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 1:19 pm Editor : manabharath

ఆ ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు: సర్పంచ్ సంతోష్

మన భారత్ | తలమడుగు

కూలీ కుటుంబాల నుంచి సైన్యంలోకి అడుగులు.. పట్టుదలతో విజయాన్ని అందుకున్న గురుత్వజ్, బండి రాకేశ్

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ నియామక ఫలితాల్లో గ్రామానికి చెందిన గురుత్వజ్, బండి రాకేశ్ విజయాన్ని సాధించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

సాధారణ కూలీ కుటుంబాల నుంచి వచ్చిన ఈ యువకులు తమ కృషి, పట్టుదల, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకుని గ్రామ యువతకు ఆదర్శంగా నిలిచారు. చిన్నతనం నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు కష్టపడి చదివించారని వారు తెలిపారు. చదువుతో పాటు శారీరక దారుఢ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అగ్నివీర్ నియామకాలకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమించామని, ఆ కృషికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఎంపికైన యువకులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత కూడా పట్టుదలతో కష్టపడితే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని వారు పేర్కొన్నారు.

అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపికైన గురుత్వజ్, బండి రాకేశ్‌లను దేవాపూర్ గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ అభినందించారు. గ్రామానికి చెందిన యువకులు దేశ సేవకు ఎంపిక కావడం గర్వకారణమని ఆయన అన్నారు. వారి విజయం ఇతర యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు ఎంపికైన యువకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సైన్యంలో సేవ చేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, దేశ సేవే తమ ప్రధాన లక్ష్యమని గురుత్వజ్, రాకేశ్ వెల్లడించారు.

దేవాపూర్ గ్రామం నుంచి ఒకేసారి ఇద్దరు యువకులు అగ్నివీర్ ఉద్యోగాలకు ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. గ్రామ యువతలో కూడా కొత్త ఉత్సాహం నెలకొంది.

గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰