manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 11:21 am Editor : manabharath

ఎమ్మెల్యేకు కష్టాలు చెప్పి కంటతడి పెట్టిన రైతు..

మన భారత్ | తాంసి

జొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే.. కొనుగోలు కేంద్రంలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో గత 10 రోజులుగా పంట విక్రయం కోసం ఎదురుచూస్తున్న రైతు కొత్తూరు అశోక్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. “ఇంట్లో పిల్లలు ఎప్పుడు వస్తావ్ నాన్న అని అడుగుతున్నా, సమాధానం చెప్పలేకపోతున్నాను” అంటూ కంటతడి పెట్టారు. రైతు బాధను విన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆయనను ఓదార్చి, ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, తూకం ప్రక్రియలో జాప్యం, గన్నీ సంచుల కొరత, చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

అకాల వర్షాల కారణంగా తడిసిన జొన్నలను కూడా ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి రైతులకు న్యాయం చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అలాగే తాంసి కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం రేపటి నుంచి తన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో తాంసి మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్, జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్, మండల నాయకులు వినోద్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, మహేందర్, రమణ, అశోక్, నాగిరెడ్డి, రఘు, సోను, వెంకట్ రెడ్డి, ఆశన్న, నర్సింగ్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰