manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 5:24 am Editor : manabharath

మహిళలకు అవగాహన.. యువతకు క్రమశిక్షణ అవసరం: గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణ

మన భారత్ | గంట్యాడ

ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న మహిళలతో సమావేశం.. శక్తి యాప్‌పై అవగాహన

విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని గొడియాడ, కిర్తుబర్తి, పెనసాం గ్రామాల చెరువుల వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళలతో గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణ శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, యువతలో క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలపై ఆయన పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పిల్లలు గంజాయి, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. చిన్ననాటి నుంచే పిల్లలకు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవాటు చేస్తే సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. ముఖ్యంగా యువతను బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే బాలల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో (POCSO) చట్టం గురించి మహిళలకు వివరించారు. బాలలపై జరిగే నేరాలను అరికట్టడంలో తల్లిదండ్రులు, సమాజం కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

మహిళలపై జరుగుతున్న నేరాలు, వేధింపుల గురించి అవగాహన కల్పించిన ఎస్సై, ఇటువంటి ఘటనలను మౌనంగా భరించకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం పొందాలని తెలిపారు.

మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్‌ వినియోగంపై కూడా అవగాహన కల్పించారు. సమావేశానికి హాజరైన మహిళల సెల్‌ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు. ఈ యాప్ ద్వారా అత్యవసర సమయంలో త్వరితగతిన పోలీసు సహాయం పొందవచ్చని వివరించారు.

ఈ కార్యక్రమంలో గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణతో పాటు పోలీస్ కానిస్టేబుల్ శాంతారావు, మహిళా పోలీస్ కానిస్టేబుల్ లలిత, గ్రామ పెద్దలు మరియు ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న మహిళలు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰