మన భారత్ | దత్తిరాజేరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీదే విజయం: పెద్దింటి మోహన్రావు
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ పెద్దింటి మోహన్రావు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తిరాజేరు మండలం క్లస్టర్-1 పరిధిలో నిర్వహించిన డిజిటల్ మహానాడు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించామని, మండలంలోని 12 గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రెండు రోజుల పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. సుమారు 15 రకాల రుచికర వంటకాలతో విందు భోజనాలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఆతిథ్యం అందించినట్లు వెల్లడించారు.
వర్చువల్ మహానాడు కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని, కార్యకర్తల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ మహానాడు కార్యక్రమం నాంది పలికిందని, పార్టీ బలోపేతానికి ఇది కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న ఉత్సాహం కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పదవులను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని మోహన్రావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ఆదరణ పొందుతున్నాయని, ముఖ్యంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేపడుతున్న అభివృద్ధి పనులు పార్టీ విజయానికి దోహదపడతాయని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయిలో మరింత చురుకుగా పనిచేసి ప్రజలతో మమేకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰
