manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 3:36 pm Editor : manabharath

కోతుల బెడద.. ప్రజల భయాందోళన

కోతులను సురక్షితంగా తరలించాలని జూ అధికారులకు గ్రామస్తుల వినతి

మన భారత్, విజయనగరం:
విజయనగరం జిల్లా జామి మండలం జామి గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో కోతుల సంఖ్య అధికమై ప్రజల ఇళ్లలోకి ప్రవేశించడం, ఆహార పదార్థాలు, పంటలను ధ్వంసం చేయడం, చిన్నపిల్లలు, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై గ్రామ ప్రజలు, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కలిసి ఇటీవల దరఖాస్తు సమర్పించారు. అలాగే 06-05-2026న జరిగిన మండల జనరల్ బాడీ సమావేశంలో గౌరవ ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ, ఎంఫీపీ సభ్యులు సమస్య తీవ్రతను చర్చించి కోతుల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసినట్లు సమాచారం.

గ్రామ ప్రజల వివరాల ప్రకారం.. కోతులు గుంపులుగా సంచరిస్తూ ఇళ్లపైకి ఎక్కడం, వంటింట్లోని ఆహార పదార్థాలను తీసుకెళ్లడం, పంటలను నాశనం చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిన్నారులు, మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. పలువురు గ్రామస్తులను కోతులు కరిచిన ఘటనలు కూడా జరిగినట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గ్రామస్తులు విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్క్ డైరెక్టర్‌కు వినతి పత్రం పంపించి గ్రామంలో సంచరిస్తున్న కోతులను సురక్షితంగా పట్టుకుని జూ లేదా అడవి ప్రాంతాలకు తరలించాలని కోరారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక సిబ్బందిని పంపించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామంలో పెరుగుతున్న కోతుల బెడదపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణతో పాటు గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..