manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 10:37 am Editor : manabharath

పీఎం-అజయ్ పథకానికి ఆ గ్రామాల ఎంపిక..

ఎస్సీ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు

ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల మంజూరు

మన భారత్ | ఆదిలాబాద్

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం-అజయ్’ (ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన) పథకం కింద ఆదిలాబాద్ జిల్లాలో ఆరు గ్రామాలు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులతో కలిసి పథకం అమలు విధానంపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివృద్ధి, ముఖ్యంగా ఎస్సీ విద్యార్థుల్లో అక్షరాస్యత పెంపు, విద్యా అవకాశాల విస్తరణ, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధే పీఎం-అజయ్ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు. గ్రామ స్థాయిలో విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా సామాజికంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.

జిల్లాలో ఎంపికైన ఆరు గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులను గ్రామాల్లో విద్యా సదుపాయాల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, పారిశుధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి సదుపాయాల మెరుగుదల, సామాజిక మౌలిక వసతుల కల్పనకు వినియోగించనున్నట్లు వెల్లడించారు.

ఎస్సీ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులు పారదర్శకంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యమన్నారు.

అలాగే పథకం అమలులో ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, స్థానిక ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని గ్రామాలు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..