manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 2:49 am Editor : manabharath

పాము కాటుతో మహిళ మృతి..

చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత కన్నుమూసిన గుణశెట్టి లక్ష్మి

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గంట్యాడ పోలీసులు

మన భారత్ | విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని మోకాలుపాడు గ్రామంలో పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. పోలీసుల వివరాల ప్రకారం మోకాలుపాడు గ్రామానికి చెందిన గుణశెట్టి లక్ష్మి ఈ నెల 20వ తేదీ రాత్రి భోజనం అనంతరం తన ఇంటి ముందు గడపలో ఇద్దరు మనవరాళ్లతో కలిసి నిద్రిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఆమె భర్త సింహాచలం ఇంటి ముందు సిమెంట్ రోడ్డుపై మంచం వేసుకుని నిద్రిస్తున్నాడు.

రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో గుణశెట్టి లక్ష్మి కుడికాలు పాదం వేలికి ఏదో కరిచినట్లు అనిపించడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడికి చేరుకుని చూడగా కొంత దూరంలో ఒక పాము మఠం వేసుకుని కనిపించినట్లు సమాచారం. గ్రామస్తులు వెంటనే ఆ పామును చంపివేసినట్లు తెలిపారు.

అనంతరం కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సాయంతో గుణశెట్టి లక్ష్మిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఈ నెల 26వ తేదీ తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాలకు ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతురాలి కుమారుడు గుణశెట్టి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంట్యాడ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..