మన భారత్ | తలమడుగు: తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామం నుంచి దేవాపూర్ వాగు వరకు ఉన్న ప్రధాన రహదారి భారీ గుంతలతో అద్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రోజురోజుకూ రహదారి దుస్థితి మరింత అధ్వానంగా మారుతుండటంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం ముందు రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంటే ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ రహదారి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన మార్గం కావడంతో బరంపూర్, ఝరి పున్నగూడ, చెర్లపల్లి, పల్లి (కె, బి), ఆర్లి (కె), నందిగామ గ్రామాల ప్రజలు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అయితే రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలతో నిండిపోవడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో ప్రయాణికులు, కార్లు మరియు ఇతర వాహనాల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల గుంతలు మరింత లోతుగా మారడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యేకంగా రాత్రి వేళల్లో రోడ్డుపై ఉన్న గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. పలువురు వాహనదారులు గుంతల్లో పడిపోయి గాయపడిన ఘటనలు కూడా జరిగాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. వర్షం పడిన సమయంలో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల మధ్య రాకపోకలకు కీలకమైన ఈ రహదారిని అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు సమస్యను ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. రహదారి దుస్థితి కారణంగా ప్రయాణ సమయం పెరగడంతో పాటు వాహనాల మరమ్మతులకు అదనపు ఖర్చులు కూడా భరించాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దేవాపూర్ గ్రామం నుంచి దేవాపూర్ వాగు వరకు ఉన్న రహదారిని మరమ్మతులు చేయడంతో పాటు కొత్తగా నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
#ManaBharath #Adilabad #Talamadugu #DevapurRoad #RoadProblems #Potholes #TrafficIssues #VillageRoads #PublicSafety #AdilabadNews
